Vemana Sathakam - వేమన శతకం


 వేమన శతకం


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదా:
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా:
అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.


నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం. ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.

  • వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన.
  • విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు.
బ్రౌను కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు


వేమన జీవిత చారిత్ర :
సాధారణంగా ప్రచారంలో ఉన్న కధాంశాలు:వేమన జీవితం గురించి (పెద్దగా పరిశోధన జరుగక ముందు) ఈ క్రింది కధ ప్రచారంలో ఉంది. (నేదునూరి గంగాధరం సంకలం చేసిన "5000 వేమన పద్యాలు" పుస్తకం ఆరంభంలో ఇచ్చిన కధ).

కొండవీడు పాలించిన కుమారగిరి వేమారెడ్డి కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు భిల్లకన్యను వివాహమాడి అడవిలోని పరుసవేది జలాన్ని సంగ్రహించారు. ఒక కోమటి మిత్రుడు ఆ బ్రాహ్మణునినుండి పరుసవేదిని కుయుక్తితో తీసుకొని ఆ బ్రాహ్మణుని మరణానికి కారకుడయ్యారు. ఇది తెలిసి రాజు కుమారగిరి వేమారెడ్డి కోమటి సంపదను స్వాధీనం చేసుకొన్నారు. కోమటి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ హత్యాపాతకం పోవడానికి కోమటి వేమారెడ్డి పలు ధర్మకార్యాలు చేయడమే కాకుండా తన పిల్లలకు ఆ బ్రాహ్మడి పేరూ, కోమటి పేరూ పెట్టారు. అలా అతని కొడుకులు పెదకోమటి వెంకారెడ్డి, రాచవేమారెడ్డి, వేమారెడ్డి. ఈ మూడవ కొడుకే వేమన కవి అయ్యారు.


యవ్వనంలో వేమన వేశ్యాలోలుడై తిరిగేవారు. బంధువులు అతన్ని అసహ్యించుకొనేవారు కాని వదిన మాత్రం చిన్నపిల్లవాడిని వలె ఆభిమానించేది. ఒక వేశ్య అతనిని వలలో వేసుకొని, అన్ని నగలు సాధించుకొని, తుదకు అతని వదినగారి ముక్కు బులాకీ తెమ్మని అడిగింది. మంగళసూత్రం వలె ముత్తయిదు చిహ్నమైన బులాకీ ఇవ్వడానికి ముందు వదిన పెట్టిన నియమం వల్ల వేమన తాను తుచ్ఛమైన శారీరిక సౌఖ్యాలకోసం వెంపర్లాడుతున్నానని గ్రహించారు. జ్ఞానాన్ని ప్రసాదించిన వదినకు ప్రణమిల్లారు.



తరువాత వ్యవసాయం చేయసాగారు. ఎవరికీ పనికిమాలిన వెర్రిపుచ్చకాయలు సాగుచేసి కూలిగా ఆ పుచ్చకాయలే ఇస్తానన్నారు. అతిపేదరికంతో బాధపడుతున్న ఒక కుటుంబం అలా పుచ్చకాయలు తీసికెళ్ళి వాటిని తెరచి చూస్తే అందులో మణులున్నాయట. తరువాత ఆ సంపదతో వేమన అన్న భాగ్యవంతుడయ్యారు.



వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పారు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించారు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందారు.


పరిశోధనాత్మక జీవిత చిత్రం

వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, తరువాత మరికొందరు అధ్యయనం చేశారు. వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి వంటి పండితులు, పరిశోధకులు ఈ విషయంపై వివిధ అబిప్రాయాలు తెలిపారు. ఈ పరిశోధనల సారాంశం, వాటి గురించి కొంత ఖండన త్రిపురనేని వెంకటేశ్వరరావు "వేమన - పదహారేళ్ళ పరిశోధన"లో ఉన్నది. అతని కాలం గురించి ఏకాభిప్రాయం ఇప్పటివరకూ లభించలేదు. వివిధ పద్యాలలో ఉన్న పాఠాంతరాలు ఈ సమస్యను మరింత జటిలం చేస్తన్నాయి. త్రిపురనేని వెంకటేశ్వరరావు అభిప్రాయం ప్రకారం వేమన జీవితం గురించిన ఊహాచిత్రం ఇలా ఉంది. [3].


వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయు. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగారు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడ ఒక ఇల్లు (విడిది) ఉన్నది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. సంస్కృతముగణితము నేర్చుకొన్నారు. (ఒకటి క్రింద నొక్కటొనర లబ్దము పెట్టి వరుసగా గుణింప వరుస బెరుగు - geometric progression - తెలుసుకొన్నాడు). పద్దులు వ్రాయగలరు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నారు. నీతిని తెలిసినవారు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు.



కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డారు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటారు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును.



అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనారు. దాని గురించి మరల మరల ప్రస్తావించారు. అతని ఎందరో యోగులను, గురువులను దర్శించారు. వారు చెప్పిన సాధనలు చేశారు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నారు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నారు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించారు.



వేమన భార్య, కూతురి పెళ్ళి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది కాని వేమన తిరస్కరించారు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగారు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే "వెర్రి వేమన్న" అని అభివర్ణించుకొన్నారు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రభోధించారు.



ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్ధిక సంస్కారాన్ని ప్రబోధించారు. గురువుల కపటత్వాన్ని నిరసించారు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక వైఎస్ఆర్ జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో) మహాసమాధి చెందారు.


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి