Sree Lakshmi Narayani Golden Temple | శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?


Sree Lakshmi Narayani Golden Temple Tamil Nadu | శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..? 

శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. 

ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.

ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు. 

ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశారు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.
ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు.

ఇవిగో..ఆ స్వర్ణ దేవాలయ అపురూప చిత్రాలు .. చూసి తరించండి..!! శుభం భూయాత్ 
















–  ఫణి ప్రసాద్ యాల్లజోస్యుల.


ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం లేదా విష్ణుదేవాలయం కాంభోజ దేశం లో ?


ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం' మన భారతదేశంలో లేదని ..! అది 'కాంభోజ దేశం' లో వుందని ..? ఆదేశం ఎక్కడ వుందో ..! దాని పూర్తి “కధ – కమామీషు”లు .. ఇదిగో ..ఇక్కడ చదవండి.. చూడండి ..!!

“Angkor Wat” (లేదా Angkor Vat) ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం 'కంపూచియా') లోని “అంగ్ కోర్” వద్ద 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది. ఇప్పటివరకూ, ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం.
ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంపూచియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.
క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట.
భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని “కంపూచియా”లో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు? నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా?

అసలు విషయానికొస్తే, ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో 'కాంభోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజ దేశాన్ని “కంబోడియా”గా మార్చేశారు. యూరోపియన్‌ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో “కంపూచియా”గా మారిపోయింది.
పూర్వకాలంలో, కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది “హిందూ రాజులు” కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. “చైనా” రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా “భరత ఖండానికి” చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి.(కాంభోజ రాజు కధలు..?)

“చోళ” రాజ్యానికి చెందిన ఒక రాజు, “టోనెల్‌ సాప్‌” నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. “ఖ్మేర్‌” సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్‌ సామ్రాజ్యాధినేత అయిన 'కాము'తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. “సంస్కృతం” అధికారభాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి.
జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది.
ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి.
భారతదేశంలో కూడా ఇప్పటివరకు, ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. ఆ దేవాలయాన్ని చూసి హిందూ ధర్మ/మతం గొప్పదని తెలుసుకొని .. గర్వపడుదాం..!! శుభం భూయాత్ .!