తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం మండలంలో

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి

శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది. విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో.
భగవానుని మోహినీ రూపం కధ అందరికీ తెలిసిందే. మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని
వెంబడించాడు. మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట. దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుని చూశాడుట. మోహిని తలలోంచి పువ్వు రాలి పడ్డదిగనుక రాలి క్రమంగా ర్యాలి అయిందంటారు. ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందునుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపంతో వున్నదంటారు. ఇంకో కద ప్రకారం, 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్నిచోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు. ఆ విగ్రహాన్ని
కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు. విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని
కనుగొని ఆలయాన్ని కట్టించాడు. ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైవున్న ఈ ఆలయంలోని స్వామి సౌందర్యం వర్ణనాతీతం. ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు, ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు, అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి. వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణ। ఇక్కడ స్వామి పాదాల దగ్గర చిన్న గుంటలో ఎప్పుడూ నీరు వుంటుంది। ఎన్నిసార్లు తీసినా ఆ నీరు అలాగే వూరుతూ వుంటుంది.
స్వయంభూనో, శిల్పి చాతుర్యమో, ఏదయినాగానీ ఆ దేవదేవుని అవతారిమూర్తిని చూసి అద్భుతమని చేతులు  జోడించవససినదే. ఈ క్షేత్రంలోని ఇంకొక విశిష్టత విష్ణ్వాలయం ఎదురుగావున్న ఈశ్వరాలయం -- శ్రీ ఉమా  కమండలేశ్వరాలయం. పూర్వం అక్కడ త్రిమూర్తలలో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడుట. ఆ సమయంలో  ఆయన తన కమండలంపై ఉమతో కూడిన ఈశ్వరుని ప్రతిష్టించాడుట. అందుకే ఈ ఆలయం ఉమా  మండలేశ్వరాలయంగా ప్రసిధ్ధికెక్కి
ంది. ఇక్కడ ఇంకొక విశేషం తర్వాత తెలిసింది. ఇది చదివిన తర్వాత
వెళ్ళినవాళ్ళు గమనించండి. ఈశ్వరుడుకి అభిషేకం చేసిననీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి
మార్గంలేదుట. మోహినీమూర్తినిచూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ  హరించుకుపోతుందంటారు. ట్రాన్సఫర్ కావాల్సిన ఉద్యోగస్తులు ఒకసారు ఈ దేవాలయాన్ని దర్శిస్తే త్వరలో ట్రాన్సఫర్ అవుతుందిట. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం (పూతరేకులకు ప్రసిధ్ధి) మండలంలో వున్న ఈ గ్రామానికి రాజమండ్రినుండి  బస్సులున్నాయి. 
రావులపాలెంనుంచి ఆటోలోకూడా వెళ్ళవచ్చు।

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం (kadapa)



కడప టౌన్ నుంచి ఒంటిమిట్ట 25km ఉంటుంది . శ్రీ కోదండరామ స్వామి ఆలయం ప్రసిద్ధిచెందాడు.
ఈ ఆలయం ఒక రాయతో తాయారు చేయబడ్డాయి..రామ్, సీతా లక్ష్మణులు, విగ్రహాలు ఉన్నాయి.
ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉండదు. ఎందుకు అంటే.. గుడి కట్టినపుడు రాముడు ఆంజనేయ స్వామి ని కలవ లేదు . అందుకు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు .

శ్రీ కోదండరామ స్వామి ఆలయం రామతీర్థం మరియులక్ష్మనతిర్థం
వంటి ఇద్దరి నిత్యం కొలనులు ఉన్నాయి. పురాణ నుండి కొన్ని సంఘటనలకు రామాయణం మరియు మహాభారతం ఈ ఆలయం లోపల కళారూపంలో శృంగారమైన చేశారు.

జానపద నమ్మకం ప్రకారం, గ్రామం రెండు వ్యక్తులు, కంపన రాజు సహాయం చేసిన వొంతోడు మరియు మిత్తోడు, నుండి దాని పేరు పొందింది. బదులుగా, రాజు వాటిని తర్వాత గ్రామం పేరు. సమయం కాలంలో, గ్రామం ఒంటిమిట్ట అనేవారు.

సంగమేశ్వరుడి ఆలయం,సంగం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా


త్రేతాయుగంలో పరుశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చిన అనంతరం పాప విమోచనం కోసం దేశవ్యాప్తంగా 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో భాగంగా పెన్నా, బీరాపేరు, బొగ్గేరు నదులు కలిసిన ప్రాంతంలో ఉత్తరం వైపున చివరిదైన 101వ శివలింగం ప్రతిష్ఠించి త్రివేణిసంగమేశ్వరంగా నామకరణం చేశారు. నాటి త్రివేణి సంగమమే.. కాలక్రమేణ 'సంగం' గా మారింది. 1183లో చోళరాజులు శివలింగానికి గర్భగుడి నిర్మించారు. ఆతర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీకామాక్షిదేవి విగ్రహం ప్రతిష్ఠించారు. తదనంతరం పల్లవులు, చోళులు ఈ ఆలయానికి ముఖమండపం నిర్మించారు.
విజయనగరరాజులు ఆలయ అభివృద్ధి కోసం 100 ఎకరాల తాళ్లవనం దానమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఉదయగిరి, దు వ్వూరు రెడ్డిరాజులు ఆల యం వద్ద పలు కట్టడాలు నిర్మించారు. 1940లో కోట సుబ్బరామయ్యశెట్టి అనే దాత ఆలయానికి రాజగోపుర నిర్మాణం చేపట్టారు. గోపురానికి మొదటి అంతస్తు పూర్తికాగానే ఆయన మరణించారు. దీంతో రాజగోపురం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆతర్వాత శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, నవగ్రహ మండపం, పరివార దేవతలు, పోతురాజు, పోలేరమ్మ, కామాక్షిదేవి ఆలయాలు నిర్మించారు. ఏటా చైత్రమాసం(ఏప్రిల్)లో సంగమేశ్వరుడికి బ్ర హ్మోత్సవాలు, కార్తీక, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో భక్తులు పా ల్గొని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తుంటారు.
పాకనాటి ప్రాతివ్రతమ్మ ఆలయం
శివాలయం వద్ద నిర్మించిన పాకనాటి ప్రాతివ్రతమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అప్పటి రాజులు 101 అడుగుల ఎత్తు ఉన్న ఒంటి స్తంభానికి ప్రాతివ్రతమ్మ విగ్రహం చెక్కి ప్రతిష్ఠించారు. ఆస్తంభానికి పక్కనే ప్రాతివ్రతమ్మకు ఆలయం నిర్మించారు. ఈఆలయంలో అమ్మవారిని మహిళలు విశేషంగా కొలుస్తుంటారు 




శ్రీశైలం - పురాణ గాథ

శ్రీశైలం - పురాణ గాథ



శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని, శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారింది.
ఆనాటి శిల్పకళావైభవాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి పురాణ గాథలను, చారిత్రాత్మక విశేషాలను స్ఫురణకుతెచ్చి ఆధ్యాత్మికానందాన్ని పెంచుతాయి. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టు మహాలింగం చాలా చిన్నది. దీనికి శిరస్సు తాకించి దర్శించుకుంటారు. దీనికి ఇతిహాసంలో మరోకథ ప్రచారంలో ఉంది.
త్రేతాయుగంలో రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టచేసి, మిగిలిన పాపప్రక్షాళనార్థమై నారదుని సలహాపై శివదర్శనానికి బయలుదేరుతాడు. అపుడు శివుడు శ్రీపర్వతం మీదున్నాడు.
ఈ విషయాన్ని నారదుడు రామునికి చెవిలోవేశాడు. వెనువెంటనే రాముడు నీ దర్శనానికి వస్తున్నాడని శ్రీపర్వతం మీదున్న స్వామికి ఉప్పందించాడు. దాంతో రాముడి కంట పడకూడదనే తలంపుతో శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించాడు. అప్పటికే శ్రీశైల శిబిరాన్ని చేరిన శ్రీరాముడు అక్కడినుంచి శివుడ్ని దర్శించాడు. అయితే లింగ రూపాన్ని ధరించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా, మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలందుకుంటున్న మల్లికార్జున లింగం. శివదర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుత శిఖరేశ్వరం. ఆనాటినుంచి నేటివరకూ శిఖరేశ్వరంనుంచి మల్లికార్జునిని చూసే సాంప్రదాయం కొనసాగుతోంది. స్వామివారి ప్రధానాలయంలో సప్తముత్వికలు, మనోహర కుండం, బ్రహ్మకుండం, విష్ణుకుండం, నవబ్రహ్మాలయాలు ఉన్నాయి. పంచపాండవులు ప్రతిష్టించిన లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.
సాక్షాత్తు ఆదిగురువు శంకరాచార్యులవారు తపస్సుచేసిన పవిత్ర స్థలం పాలధార, పంచధారలు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలోనే శంకరాచార్యులవారు ‘శివానంద’, ‘సౌందర్యలహరి’లను రచించినట్లు చెబుతారు. శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున రెండు కిలోమీటర్లు దూరంలో సాక్షిగణపతి ఆలయముంది. దట్టమైన అడవిలో ఎత్తయిన కొండలతో, అందమైన లోయలతో గలగలపారే జలధారలతో అలరారుతున్న సుందర ప్రదేశం భీముని కొలను శ్రీమల్లికార్జునస్వామి ఆలయంనుంచి హఠకేశ్వరం చేరుకుని, అక్కడినుంచి కుడివైపున అడవి దారిలో రెండు కిలోమీటర్లు ప్రయాణించి కైలాస ద్వారం చేరుకోవాలి. కైలాస ద్వారం నుంచి మెట్లదారిలో దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీముని కొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు
శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో భీముని కొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. ‘అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే’ అంటే శిఖర దర్శనం ద్వారా శ్రీశైల నాధుడ్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదట. శిఖరేశ్వరానికి కింది భాగంలో వీరశంకరాలయం ఉంది. ఒకప్పుడు శ్రీశైల మహాక్షేత్రపు పరిధిలో సుమారు వందకు పైగా మఠాలుండేవని అంచనా. ఈ మఠాలన్నీ ప్రధానాలయానికి వాయువ్య దిశలో చోటుచేసుకున్నాయి. క్రీ.శ.9-10 దశాబ్దాలనుంచి 15వ శతాబ్దంవరకు ఈ మఠాలు ఆలయానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడం ప్రధానపాత్రను పోషించాయి.
శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి త్రికరణశుద్ధిగా అర్చించినంత మాత్రాన సర్వయజ్ఞాలు చేసిన ఫలాన్ని, సర్వతీర్థాలు సేవించిన ఫలాన్ని అనాయాసంగా పొందవచ్చని సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతిదేవికి చెప్పినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. హైద్రాబాద్‌నుంచి 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీశైలంలో భోజన వసతి సదు
పాయాలు మెండుగా వున్నాయి.

దక్షిణ కాశి' ద్రాక్షారామం

దక్షిణ కాశి' ద్రాక్షారామం




ఈ ఆలయం చారిత్రక పరిశోధకులకు, చరిత్ర విద్యార్ధులకు ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతోంది. అడుగడుగునా శిల్పకళా నైపుణ్యం కానవచ్చే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తూ ఉంటారు.
ప్రకృతి రమణీయతకు ఆటపట్టయిన తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగునా గుడి ఉంది. అవి శతాబ్దాల కాలం నాటివి.అలాంటి పుణ్యక్షేత్రాల్లో ద్రాక్షారామం 'దక్షిణ కాశి'గా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా పురాతనమైన ఆలయమనడానికి దాఖలాలుగా క్రీస్తు తరువాత 1080 నుంచి 1484 వరకూ గల శాసనాలు ఉన్నాయి. శాతవాహనుని కాలం నాటి హాలుని గ్రంథాల్లో ఈ ఆలయం ప్రస్తావన ఉంది.ఈ ఆలయం నిర్మాణం క్రీస్తు శకం 800 సంవత్సరంలో ప్రారంభించబడినట్టు భారత పురావస్తు పరిశోధనా సంస్థ రికార్డులు తెలియజేస్తున్నాయి.ఈ ఆలయానికి రెండు అంతస్తుల మండపం ఉంది. చాళుక్య భీముడు ఈ ఆలయాన్నీ, సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్నీ నిర్మించాడన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయంలోని శివుడు భీమేశ్వరుడుగా ప్రాచుర్యం పొందాడు. ఈ ఆలయం చారిత్రక పరిశోధకులకు, చరిత్ర విద్యార్ధులకు ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతోంది. అడుగడుగునా శిల్పకళా నైపుణ్యం కానవచ్చే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తూ ఉంటారు. చోళులు, శాతవాహనులు,విజయనగర రాజులు ఈ ఆలయం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.ఈ ఆలయంలో కనిపించే శాసనాలన్నీ తెలుగు, సంస్కృతం,దేవనాగరి భాషల్లో ఉన్నాయి.
ఈ ఆలయానికి 40 కిలో మీటర్ల పరిధిలో 108 శైవాలయాలు ఉన్నాయి.
ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటి. పూర్వం తారకాసురడనే రాక్షసుని కంఠంలో అమృత లింగాన్ని దేవతల మొరపై విచ్ఛిన్నం చేసినప్పుడు ఆ శివలింగం ఐదు చోట్ల ముక్కలుగా పడిందట. ఆ ఐదు ప్రదేశాలు పంచారామాలుగా ప్రసిద్ధి పొందాయి. అవే ద్రాక్షారామం, అమరారామం (అమరావతి), క్షీరారామం (పాలకొల్లు),సోమారామం (గునుపూడి భీమవరం), సామర్లకోటలోని భీమారామంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయంపై వేములవాడ భీమకవి, శ్రీనాధుడు తమ రచనల్లో ప్రధానంగా ప్రస్తావన చేశారు. శ్రీనాధుడు భీమేశ్వర దండకం రాశాడు. ద్రాక్షారామ భీమేశ్వరుని సందర్శన భాగ్యం వల్ల తనకు కవిత్వం అబ్బిందని భీమకవి పేర్కొన్నాడు. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ద్రాక్షారామమని పేరు వచ్చినట్టు పౌరాణిక గాధ. ఈ ఆలయంలో అమ్మవారి పేరు మాణిక్యాంబ.
అష్టాదశ శక్తి పీఠాల్లో మాణిక్యాంబ పీఠం ఒకటి. కార్తీక మాసంలో, శివరాత్రి ఉత్సవాల్లో ఈ ఆలయంలో విశేషంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రాంగణంలో శిల్పకళా సంపద చరిత్రకు దర్పణం పడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు, పురావస్తు పరిశోధకులు తమకు తెలియకుండానే ఇక్కడ ఎక్కువ కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. మాణిక్యాంబకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో, శ్రావణ మాసాల్లో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. మాణిక్యాంబ అమ్మవారిని అర్చిస్తే పెళ్ళికాని ఆడపిల్లలకు వెంటనే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. ద్రాక్షారామం రాజమండ్రికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. కాగా, ద్రాక్షారామానికి అతి సమీపంలో కోటిపల్లి క్షేత్రం ఉంది. నాసికా త్రయింబకంలో పుట్టిన గోదావరి కోటి పల్లి వద్ద సముద్రంలో కలుస్తుంది. కోటిపల్లి తీర్థం ఘనంగాజరుపుతూ ఉంటారు. దక్షుని శాపానికి గురైన చంద్రుడు ఈ తీర్థంలో స్నానం చేసి తన ప్రకాశశక్తిని పొందినట్టు, ఇంద్రుడు ఇక్కడ స్నానం చేసి గౌతమ మహర్షి శాపం నుంచి విముక్తి పొందినట్టు పౌరాణిక గాధలు ప్రచారంలో ఉన్నాయి. కోటిపల్లి తీర్థం మీద ఎన్నో పాటలు, స్తోత్రాలు ఉన్నాయి. శైవ క్షేత్రాల్లో పేరెన్నిక గన్నది కోటిపల్లి. కాకినాడ-కోటిపల్లి రైల్వే లైను గురించి ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్‌ సమయంలో ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. ఏళ్ళు గడిచినా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మాజీ స్పీకర్‌ జిఎంసి బాలయోగి కృషి ఫలితంగా యానం నుంచి వెదుర్లంక వంతెన నిర్మాణం జరిగింది. కోనసీమకు తూర్పు డెల్టాకు మధ్య దూరాన్ని ఈ వంతెన తగ్గించింది. గతంలో రేవు దాటి వెళ్ళేవారు. ఇప్పుడు ఆటోలు,స్వంత వాహనాల్లో సులభంగా చేరుకోగలుగుతున్నారు. ద్రాక్షారామ, కోటిపల్లిలకు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. అను నిత్యం యాత్రికులతో ఈ 
క్షేత్రాలు అలరారుతూ ఉంటాయి.

పంచారామాలు

పంచారామాలు

 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
1.దాక్షారామము -
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2.అమరారామము -
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.
3.క్షీరారామము -
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.
4.సోమారామము -
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.
5.కుమార భీమారామము -
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా
నిర్వహిస్తారు.

 


సాయి అమృత వాణి

గోమాత పూజ

గోమాత పూజ - ఫలితాలు


ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమని’ అడుగగా, గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు.
‘‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు - పితృదేవతలు కాళ్ళ యందు - సమస్త పర్వతములు భ్రూమధ్యమున - గంధర్వులు దంతముల యందు - గణపతి ముక్కున - శివుడు ముఖమున - జ్యేష్ఠాదేవి కళ్ళయందు - సూర్య, చంద్రాదులు చెవుల యందు - శంఖు చక్రములు కంఠమునందు - విష్ణుమూర్తి భుజమున - సరస్వతి రొమ్మున - నవ గ్రహములు
వెన్నునందు - వరుణ దేవుడు , అగ్ని దేవుడు తోక యందు - చంద్రుడు చర్మమున - ప్రజాపతి
రోమములయందు - త్రింశత్కోటి దేవతలు నివసించెదరు.
అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను, అష్టశ్వైర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది.
స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!
శ్రీ రామ రక్ష! సర్వ జగవూదక్ష !!’’ అని ముగించెను.

బృహదీశ్వరాలయం

బృహదీశ్వరాలయం

 తంజావూర[మార్చు]

ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి, పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో శిల్ప కళ అద్బుతం. దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..


తంజావూరు లోని బృహదీశ్వరాలయ గోపురం.

రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి. ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది.

ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం

ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం

మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.
పురాణ కథ

ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.
అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.
ఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందట.
 

పురాతన ప్రాశస్త్యం
దక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన ‘రఘువంశం’ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు ‘నాగానంద’ కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు – కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట.

కోటితీర్థం

గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది.

మహాబలేశ్వరాలయం

పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

తామ్రగౌరీ ఆలయం

మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

మహాగణపతి ఆలయం

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.

గోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్‌కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.

గోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు

ధారేశ్వర ఆలయం

ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది.

గుణవంతేశ్వర ఆలయం

ఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది.

మురుడేశ్వర ఆలయం

పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది.

సోమనాథ్

సోమనాథ్

 


సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు.
స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనిక ఇది సోమనాధ ఆలయం ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. ఆరమార్లు ధ్వంశం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణించబడుతుంది. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశ మరియొక మంత్రి అయినకె ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు చేరిన బాబా పాద రక్షలు

శ్రీ పొట్టి  శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు చేరిన బాబా పాద రక్షలు
 


అంతర్వేది

అంతర్వేది

 

అంతర్వేది (Antarvedi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో కల ఈ త్రికోణాకారపు దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం. భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.
స్థలపురాణం

కృతయుగంలో వశిష్ట మహాముని గోదావరిలోని ఓ పాయను తెచ్చి సాగరసంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. అయితే విశ్వామిత్రుని ప్రోద్భలంతో రక్తవిలోచనుడు అనే రాక్షసుడు వశిష్టుని తపస్సుకు భంగం కల్గించడమే కాకుండా, అతని కుమారులను హతమారుస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్టుడు నరసింహస్వామిని ప్రార్ధించగా, ఆయన ప్రత్యక్షమై రక్తవిలోచనుడితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడిని భూమిపై పడే ప్రతీ రక్తపు బొట్టూ, ఓ రాక్షసుడిగా మారుతుంటుంది. అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని రప్పించి, రాక్షసుడి రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుక చాచగా, రాక్షసుడిని నరసింహుడు సంహరిస్తాడు. ఆపై, వశిష్టుని కోరిక మేరకు నరసింహాస్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి.

క్షేత్ర నామం

బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశము (కమలము)
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి , యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదిక గా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.

రక్తవలోచనుని కధ

ఒకానొక సమయం లో రక్తావలోచనుడు (హిరణ్యాక్షు ని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వం తో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడు కి వశిష్ఠుడు కి ఆసమయం లో జరిగిన సమరం లో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు.
వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువు ను ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తి ని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధము ను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్య లో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

ఆలయ నిర్మాణ విశేషాలు

రాత్రిసమయంలో ప్రధాన గోపురపు వెలుగులు.
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీ కొపనాతి కృష్టమ్మ. ఈయన అంతర్వేది పరిసరాలలో ఒక జమీందారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగినది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా విగ్రహము కలదు. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా(నడవా) మాదిరి నిర్మించి మద్యమద్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానది కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసినారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .

నీటిలో కల వశిష్టాశ్రమ ప్రధాన కట్టడం

వశిష్టాశ్రమము
అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము కలదు. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడినది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించినారు. చుట్టూ సరోవరము మద్య కలువపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి కలవు. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు కలవు.

లైట్ హౌస్

దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా లైట్ హౌస్ కలదు. దీనిని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విధ్యార్ధులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్ హౌస్ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి కలదు. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము,వశిష్టాశ్రమము,మిగిలిన దేవాలయములు,దూరదూరంగా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీరప్రాంతము వెంబడి కల సర్వితోటలు అత్యద్భుతంగా కానవస్తాయి.

(గుర్రాలక్క) ఆలయము

నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రదాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో కలదు. స్థల పురాణ రెండవ కధనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.

అన్న చెళ్ళెళ్ళ గట్టు
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మద్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సముద్రతీరం

వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ది పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుబ్రంగానూ, స్వచ్చంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, లైట్ హౌస్, గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

ఇతర ఆలయాలు
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్దమైనవి. విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు కలవు.

ఇతర విశేషాలు

అంతర్వేది గ్రామము సినిమా షూటింగులకు పెట్టినపేరు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపుల చిత్రాలైన మూగమనసులు లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగినది. ఇంకా జరుగుతున్నవి.

రవాణా సౌకర్యాలు
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి. అంతర్వేది సఖినేటి పల్లి మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నరసాపురం వెళ్లి అక్కడ పడవ ఎక్కి సఖినేటి పల్లిలో దిగి ఆటో, బస్సులో వెళ్ళవచ్చు. ఈ మార్గంలో అంతర్వేది నరసాపురం నుంచి 7 కిలోమీటర్లు దూరం. లేదా, చించినాడ బ్రిడ్జి మీదుగా రోడ్ మార్గంలో వెళ్లి దిండి, కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది చేరవచ్చు. ఈ మార్గంలో నరసాపురం నుంచి అంతర్వేది 20 కిలో మీటర్లు ఉంటుంది.

రైలు
హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నరసాపురం చేరవచ్చు.

సౌకర్యాలు
అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదు. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ కలవు. రెండు ప్రైవేటు లాడ్జిలు కలవు. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు.

దేవాలయపు పండుగలు, ఉత్సవాలు

* మాఘ శుద్ద సప్తమి- మాఘ బహుళ పాడ్యమి - బ్రహ్మోత్సవాలు
* మాఘ శుద్ధ దశమి- కళ్యాణం
* మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మైకాశి) - రథోత్సవం
* జేష్ఠ శుద్ధ ఏకాదశి - శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం
* వైశాఖ శుద్ధ చతుర్దశి - నృసింహ జయంతి

కోరిన వారికి కొంగుబంగారం జొన్నవాడ

కోరిన వారికి కొంగుబంగారం జొన్నవాడ

 
 
లోకహితం కోరిన కశ్యప మహర్షి ఒకసారి పినాకిని ఒడ్డున తల్పగిరి, రజితగిరి, వేదగిరి అనే కొండల వద్ద యాగం మొదలుపెట్టాడు. యాగం ముగిసిన తర్వాత మల్లికార్జునస్వామి ప్రత్యక్షమయ్యాడు. పరమానందభరితుడై ప్రత్యక్షమైన పరమేశ్వరుని చూసి కాశ్యప మహర్షి ‘స్వామీ! లోకహితం కోసం తొందరపడి ఒంటరిగా వచ్చావే! దేవి కూడా ఇక్కడ ప్రత్యక్షమైతే మహదానందం కలుగుతుంది’ అన్నాడు. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి సమ్మతించగా కామాక్షిదేవి ప్రత్యక్షమైంది. కాశ్యప మహర్షి మల్లికార్జునస్వామిని, కామాక్షిదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. పూజలు సల్పారు.
ఆ సమయంలో తీర్ధయాత్రలకు బయలుదేరిన దుర్వాసముని రాజగిరికి చేరుకున్నాడు. అయితే ఆయన రాకను గమనించలేదు శివుడు. అందువల్ల ఆగ్రహించిన దుర్వాసముని శివునితో ‘ఈప్రదేశంలోని ఆలయం పుట్టుపూర్వోత్తరాలే లేకుండా పోతుంది’ అని శపించాడు.
ప్రళయం వచ్చింది. పినాకిని నదిలో ఉప్పెన పొంగింది. ఉప్పెనలో ఆలయం మునిగిపోయింది. మల్లికార్జునస్వామి, కామాక్షిదేవిల విగ్రహాలు ఉప్పెనలో కొట్టుకుపోయాయి. ఇది పూర్వగాథ.
కలియుగం అవతరించింది…
పచ్చనిపైర్లతో ఎంతో సమృద్ధిగా ఉన్న జొన్నవాడ ప్రదేశంలో పశువుల కాపర్లు తమ పశువులను మేపుతున్నారు. వారిలో ఒక బాలుడు భూమిలో ఏదో ప్రకాశం ఉన్నట్టు చూసాడు. అక్కడ భూమిని తవ్వగా ఒక శివలింగం కనిపించింది. ప్రజలు దాన్ని చూసి ఆ లింగం ఉప్పెనలో కొట్టుకుపోయిన లింగం అని తెలుసుకున్నారు. లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆయనతో పాటు ఉండాల్సిన కామాక్షిదేవి ఏమయింది? నని చింతించసాగారు. మరికొద్ది రోజుల్లోనే ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. పినాకిని నదిలో చేపలు పట్టడానికి విసిరిన వలలో అమ్మవారి విగ్రహం దొరికింది. సంతసించిన ప్రజలు మల్లికార్జునస్వామి పక్కనే అమ్మవారిని ప్రతిష్టించారు. వారు తినే మాంసం, చేపలనే నైవేద్యంగా సమర్పించసాగారు. కాని ఆ అమ్మవారు రాత్రిపూట బిగ్గరగా నవ్వడమూ, ఉగ్రరూపంలో సన్నిధి వదిలి ఊరిలోపలికి ప్రవేశించి ఆవులను, కొంగలను, కోళ్లను చంపి స్వాహా చేయసాగింది. ప్రపంచాన్ని కాపాడాల్సిన తల్లి అలా జీవరాశులను నాశనం చేయడం చూసి ప్రజలు కలవరపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఆదిశంకరుడు వచ్చారు. మల్లికార్జునస్వామిని, కామాక్షిదేవిని దర్శించుకుని పూజించాడు. ఆరోజు రాత్రి ఆ ఆలయంలోనే ఉండి ఉదయానే్న బయలుదేరాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ దేవి ఆదిశంకరుణ్ణి కూడా హింసిస్తుందేమోనన్న అనుమానంతో ప్రజలు భయపడ్డారు. అమ్మవారి గురించి, ఆమె మాంసాహార్రపీతి గురించి వారు ఆదిశంకరునికి తెలిపారు. ఆమె వెళ్లే మార్గంలో ఆదిశంకరుడు శయనిస్తే ఆయన ప్రాణాలకు హాని జరుగుతుందని ప్రజలు వారించారు. ఆయను జాగ్రత్తగా ఉండమనిచెప్పారు. ఆదిశంకరుడు ‘మీ పశువులను ఆ కామాక్షిదేవి భుజించకుండా ఉండేలా చేస్తాను’ అని మాటిచ్చాడు
అర్ధరాత్రి…దేవి బిగ్గరగా నవ్వుతూ ఆలయంనుండి బయటికి వెళ్లింది. దారిలో శయనించిన ఆదిశంకరుణ్ని తప్పుకోమని హెచ్చరించింది. ఆదిశంకరుడు ఆ దేవినిప్రసన్నం చేసుకోవాలని స్తుతించారు. ఆయన కీర్తించే ఒక్కో శ్లోకానికి అమ్మవారి రౌద్రం తగ్గసాగింది. ఆమె మొహం ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ఆదిశంకరుడు ఆమె ఎదుట ఒక శ్రీ చక్రాన్ని స్థాపించాడు. ఆ తర్వాత దేవిని చూసి ‘‘తల్లీ! భక్తులు ఇకపై భయపడకుండా నిన్ను పూజించాలంటే నువ్వు ఇకపై వికటాట్టహాసం చేయకూడదు. మాట్లాడకూడదు. ఆలయంనుండి బయటికి వెళ్లకూడదు’’ అని ఆంక్ష విధించాడు. దేవి ‘‘నన్ను నమ్మి వచ్చే భక్తులకు వరములివ్వడం, ఆశీర్వదించడం ఎలా’’ అని ప్రశ్నించింది
‘‘భక్తుల కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించు. వారు వేడుకుంటే నెరవేరుస్తానని తెలిసేలా చేసి, వారు సంతోషంగా జీవించడానికి సాయపడు’’ అన్నాడు ఆదిశంకరుడు.
కామాక్షిదేవి ఆయన ఆంక్షలకు కట్టుబడింది. తన సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని వరమిచ్చింది.
నెల్లూరునుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడలో శాంతస్వరూపిణిగా కామాక్షిదేవి కొలువై ఉంది. అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున వున్న మార్గంలో వెడితే పినాకిని నదికి చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన మహిళా ద్వారపాలకులు గోచరిస్తారు. లోపలికి వెడితే విశాలమైన లోగిలి. దాన్ని దాటి వెడితే ముందుగా కల్యాణ మండపం వస్తాయి. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్థంభం ఉంటాయి.
ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దానిపక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి. ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు. అర్ధమండపం తర్వాత వరసగా గర్భగుడులు ఉంటాయి. మొదటి గర్భగుడిలో లక్ష్మీగణపతి, ఎడమవైపున చిన్న మహలక్ష్మి విగ్రహం ఉంటాయి. గర్భగుడిలో మల్లికార్జునస్వామి కొలువై ఉన్నారు. చిన్న లింగం, వల్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణ భరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది. నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశము, పాశము ఉంటాయి. కింది రెండు చేతులలో ఒకటి అభయ హస్తంగాను, మరొకటి శరణాగతి పొందమని చూపినట్టు ఉంటాయి. ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేవి ఎదుట శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరుడు చేత ఒక దండంతో దర్శనమిస్తాడు. బయటి ప్రాకారంలో గణపతి, వల్లి, దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి, పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలున్నాయి. బయటి ప్రాకారంలో భక్తులు వేచి ఉంటారు. ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్, మే మాసాలలో పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధికి పెద్దఎత్తున ముత్తయిదువలు చేరుకుని పూజలు చేస్తారు.

కేదార క్షేత్రం

కేదార క్షేత్రం 

 

 నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యాత్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపోవడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు.
గడచిన వారం రోజులలో హిమాలయాలలోని కేదార యాత్రీకుల ఆపదలు చాలా తెలుసుకున్నాం. ఈనాటికి ఐదువేల మంది చనిపోయారని తెలుస్తున్నది. సుమారు ఎనభైరెండువేల మంది ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో క్షే మంగా రక్షింపబడ్డారు. చాలామంది ఇళ్ళకి చేరుకున్నారు. దాదాపు అక్కడ ఇరుక్కున్న వారందరూ రక్షింపబడినట్టే. నేడో రేపో ఆ మిగతా పని కూడా పూర్తి అవుతుంది. భారతీయ వాయుసేన యంత్రాంగం ఆరు రోజులలో చాలా గొప్ప సేవ చేసింది. ఈ సంఘటనపైన ఎన్నో రకాల వ్యాఖ్యలు సహజంగా వినబడుతున్నాయ. అసలు ఈ మతం నమ్మకంతో ఇంతమంది అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళాలి? ఇదంతా కేవలం మూఢనమ్మకం వల్ల వచ్చి న ఆపద కాదా..? ఇదొకరకం విమర్శ! ఇలాంటి నమ్మకాలు లేకపోతే ఇంతమంది పోయుండేవారు కాదుకదా..అని మరో వ్యాఖ్యానం. మనం గొప్ప నాగరికతతో తయారుచేసుకున్న రోడ్లపైన దేశం మొత్తం మీద పది రోజులకొకసారి ఐదువేల మంది పోతూ ఉండవచ్చు. దానికి ఏ విశ్వాసము కారణము కాదు. కేవలం మన నాగరికతలోని అనాగరికతే కారణం! మన సాంకేతిక విద్యకి పరాకాష్టగా నిర్మించిన ‘టైటానిక్’ అనే ప్రయాణికుల నౌకకి పట్టిన గతికి ఎవరు బాధ్యులు? మరొక్క రోజు ప్రయా ణం క్షేమంగా సాగితే ఆ పధ్నాలుగు వం దల మంది మహా వైభవంగా ఉత్సవం చేసుకుని ఉండేవారు. ఇలాంటివి ఎన్నో! మన భారతదేశంలో ఏ క్షణంలో లెక్క చూసినా సుమారు 15 కోట్ల మంది భక్తులు దేవాలయాలలో, క్షేత్రాలలో, మఠాలలో ఉంటూ ఉంటారు. వీరందరిలో 99 శాతం క్షేమంగా తిరిగి వస్తున్నారు. ప్రమాదాలెన్ని జరిగినా ప్రజల విశ్వాసం మాత్రం ఏమీ తగ్గదు. మానవ జీవితంలో వ్యక్తికి, సంఘానికి కూడా శుభాశుభాలు, అనుకోని ఆపదలు అక్కడక్కడ కలుగుతూనే ఉంటాయి. దానివల్ల జీవన స్రవంతి ఆగకుండా సాగుతూనే ఉంటుంది. కేదారయాత్ర విషయంలో ఆలోచిస్తే అక్కడ జరిగిన ప్రకృతి బీభత్సంలో ఎనభై రెండు వేల మంది క్షే మంగా తిరిగి రావడం చాలా గొప్ప విష యం. ప్రకృతియొక్క ఆగ్రహం కంటే భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఎక్కు వే ఉంది. ఇటువంటి సంఘటనలకు ఏదో కారణం వెతకనే కూడదు. ఆవిధంగా ఎంత తిప్పలు పడ్డా సరియైన కారణం దొరకదు. కానీ ఓ దుర్మార్గుడు బాంబు పేల్చి ఒక వందమందిని చంపడంలో కారణం ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆ విధంగా కారణం తెలిసిన చోట ఒక కర్తవ్యం ఉంటుంది. మృ తులు పదిమందైనా, వందమందైనా కానీ చాలా విచారకరమే. కానీ ఆపదయొక్క పరిమాణాన్నిబట్టి నష్టాన్ని అవగాహన చేసుకోవలసి ఉంటుంది. కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యా త్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపో వడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళిమొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. ఆవిధంగా మొక్కులు చెల్లించుకునే క్షేత్రాలు దేశం లోపలే అనేక సంఖ్యలో ఉన్నాయి. కేదారయాత్ర చరిత్రలో – పంచపాండవులు ద్రౌపదీదేవితో కలిసి పాదచారులై కేదారానికి మహాప్రస్థానం వెళ్ళారని మహాభారతం వర్ణిస్తోంది. ఆ ఆలయంలో పంచపాండవుల మూర్తులు కూడా ఉన్నాయి. ఆ యా త్రలో ఎటువంటి సౌకర్యాలు అమర్చుకోకుండా ఈశ్వరధ్యానంలో నడచి, నడచి శరీరాలు విసర్జించారు వాళ్ళు. ధర్మరాజు మాత్రమే చివరి పర్వతాగ్రందాకా వెళ్ళి దేవతల దర్శనం చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ పడిపోయినా ఒక కుక్క మాత్రం ఆయనతో చివరివరకు నడిచి వచ్చింది. ధర్మదేవత ఆయన్ని స్వర్గానికి ఆహ్వానించినా కుక్కను కూడా తనతో అనుమతించాలని పట్టుపట్టాడు. ఆయన న్యాయ దృష్టికి దేవతలు మెచ్చారు. ఆ కుక్క ఎవరో కాదు ఆయనని పరీక్షించిన ధర్మదేవతే అని ఋజువైంది. మహాప్రస్థానమంటే ఈ లో కాన్ని శాశ్వతంగా వదిలి తిరిగివచ్చే సం కల్పం లేక పైలోకాలకి ప్రస్థానం సంకల్పించి దేహత్యాగం చేయడమన్నమాట. ఈ యాత్ర చేయడంలో అటువంటి మనఃప్రవృత్తి కొందరికి ఉంటూనే ఉండింది. సంసారాన్ని వదలిపెట్టిన విరాగులు, అటువంటి భావన కలిగిన కొద్దిపాటి గృహస్థులు, ఇక బైరాగులు, సన్యాసులు, జీవనయాత్ర పూర్తికాబోతున్నదని నిశ్చయం చేసుకున్న వారు అనేకమంది ఏవిధమైన జాగ్రత్తలు, అన్న వస్త్రాల ఏర్పాట్లు కూడా చేసుకోక అటువెళ్ళి తిరిగి రాలేదు. ఒకవేళ అక్కడ చేరిన తరువాత కూడా స్వాధీనం కాని శరీరంలో వారుకాలం గడిపేవారుకాదు. ఈశ్వర ధ్యానంతో ప్రాణాయామం దీక్షగా చేసి ఊపిరి చాలా వరకు నిగ్రహించి, నెమ్మదిగా ఆ ప్రక్కన కొండ చివరికి చేరి, మనస్సు, బుద్ధి, చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసి మైలు లోతైన అలకనందలోయలో శరీరాన్ని విసర్జించేవారు. ఆ నిగ్రహం చేత కేవలం శరీరమే లోయలో పడి ఆ జీవాత్మ దారిలోనే శరీరాన్ని వదిలి ఊర్థ్వలోకాలని చేరుకునేది. ఇది ‘‘్భృగుపాత’’మనే పేరుగల దేహాన్ని విసర్జించే ఒకానొక ప్రక్రియ. అది దుఃఖంతో చేసుకునే ఆత్మహత్యకాదు. ఇదంతా సుదీర్ఘమైన సాధనతో పూర్తి విరాగంతో ఊర్థ్వ గతిపైన దీక్షతో మోక్షప్రదాత అయిన పరమశివుడు కేదారనాధుని దయపైన నమ్మకంతో చేసిన పని. అలాంటి వారు వేలమంది ఉండరుకదా? హిమవంతం తపోభూమి.గృహస్థులకు సంబంధించిన కర్మభూమి కాదు. వేదవ్యాస మునీంద్రుడు తన దివ్యశరీరంతో అక్కడ శాశ్వతంగా నిలిచిపోయాడు. శ్రీకృష్ణుని అంశ తేజోరూపంతో హిమాలయాలలోనే ఉండిపోయింది. అంతేకాక బ్రాహ్మణుడై మహాపాపం చేసిన అశ్వత్థామ శాపగ్రస్థుడై, రోగగ్రస్థుడై అక్కడే తిరుగుతున్నాడు. అక్కడ పవిత్ర వాతావరణంలో తన పాపం కొంత క్షయిస్తుందని సంకల్పం కావచ్చు. ఇంకా వేలాది మంది అక్కడక్కడ నందాదేవి వంటి పర్వతగుహలలో తపస్సు చేసుకుంటున్నారు. బదరీ, కేదార క్షేత్రాలున్న అన్నపూర్ణ హిమాలయ పర్వత పంక్తికి వెనుకనే ఉన్న మహోన్నత కైలాస పర్వత ప్రాంతంలో రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మజ్ఞాని అయిన హనుమంతుడు చిరంజీవిగా సంచరిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ గృహస్థుల యాత్రాస్థలాలు కావు. సౌకర్యాలతో యాత్ర, వినోదయాత్ర, వ్యాపార సరళితో కలిసి నేటి పరిస్థితి ఇలాగ మారింది. లౌకిక క్షేమాన్ని ప్రక్కన పెట్టి, కేవలం తాత్విక దృష్టితో చూడగలిగితే అక్కడే దేహాన్ని వదలిన యాత్రికులకి చివరి క్షణంలో దుఃఖమే కలిగిందో లేక శాంతి లభించిందో మనకి తెలియదు. వాళ్ళే ఒక వేళ ఇంటికి తిరిగి వచ్చినా ఏదో ఒకనాడు మృత్యువు తప్పదు. ఇక్కడి మృత్యువు పరిస్థితులు ఎవరి స్వాధీనంలోనూ ఉండవు. ఎట్టి మృత్యువు ఏ జీవునికి మంచిదో, ఉత్తమమో తెలియదు. శరీరం ప్రకృతి వశం, జీవుని గతి కర్మవశం అయి ఉండగా జీవుడు ఈశ్వరునితో ఎంత సంబంధం పెట్టుకున్నాడో అంతమాత్రమే వారిగతి ఈశ్వరేచ్ఛ అయి ఉంటుంది. మనమందరం ఈ దేహయాత్ర చాలించిన యాత్రికులందరి జీవులకు శివానుగ్రహం కలిగి పూర్ణశాతం లభించాలని ఈశ్వరుని వేడుకుందాం. వారికి, వారి కుటుంబాలకి మనఃస్ఫూర్తిగా సానుభూతి చెప్పుకుందాం. భవిష్యత్తులో యాత్రికులందరికి అక్కడి ప్రకృతి ప్రసన్నమై ఉండుగాక!
ఈ సందర్భంలో ఒక కథని జ్ఞాపం చేసుకుందాం… ఒకనాడొక బ్రాహ్మణుడు మండుటెండలో నడచి, ఆకలితో నీరసించి ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడ ఉన్న గృహస్థుని చూచి ప్రాణం పోతున్నదని సౌంఙ్ఞతో ఆహారం వేడుకున్నాడు. ఆ గృహస్థు ఇంటి ముందరే ఉన్న చెరువును చూపించి వెంటనే స్నానం చేసి రమ్మని, భోజనం సిద్ధంగా ఉన్నదని అన్నాడు. అంతవరకూ కూడా ప్రాణం నిలువదని వెంటనే ఏదో ఇవ్వమని అడిగితే ఒక గినె్నలో పాయసం ఇచ్చాడు. తీరా పాయసం పాత్ర చేతికి రాగానే కొద్ది ధైర్యం వచ్చిన ఆ బ్రాహ్మణుడు ఒక క్షణంలో స్నానం ముగిద్దామనుకుని ఆ పాయసపాత్రను గట్టుమీద పెట్టాడు. పాపమాతడు త్వరగానే స్నానం ముగించాడు. కాని సమీపంలో చెట్టుపైన ఉన్న ఒక గద్ద ఒక విషసర్పాన్ని గోళ్ళతో చీల్చింది. ఆ మరణవేదనలో ఆ సర్పం విషం కక్కింది. ఆ విషం తిన్నగా పాయసంలో పడింది. ఎంతో ఆత్రంతో ఆకలితో ఉన్న ఆ బ్రహ్మణుడు వేగంగా పాయసం త్రాగేశాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే అక్కడే మరణించాడు. గ్రామస్థులు ఆయన మరణానికి కారకులెవ్వరని చర్చించారు. అడిగిన వెంటనే చేతికి పాయసాన్ని అందించక స్నానం చేయమని సూచించిన గృహస్థునిది తప్పా? విషం కక్కిన సర్పానిది తప్పా? అదే క్షణంలో సర్పాన్ని చీల్చి చంపిన ఆ గద్ద కారణమా? పాయసం వెంటనే తాగకుండా స్నానం కోసం ఆలస్యం చేసిన బ్రాహ్మణునిది తప్పా? చర్చలో గ్రామస్థులు తేల్చలేకపోయారు. వెంటనే ఆ ప్రక్కనే నడచిపోతున్న సాధువు కనిపిస్తే అతనిని సందేహం తీర్చమని అడిగారు. ఆ సాధువు నవ్వి – ఆ బ్రాహ్మణుని మృత్యువుకి ఆ గృహస్థుకాని, ఆ సర్పంకాని, ఆ గద్ధకాని, చివరగా ఆ బ్రాహ్మణుడే కాని ఇందులో ఎవరైనా ఒక్కరు బాధ్యులని నిర్ణయిస్తే దానివల్ల అట్టివారికా పాపం సంక్రమిస్తుందని తెలిపాడు. ఎందుకంటే ఆ మృత్యువులో అసలు పాపమే లేదు. ఎవరి పాప మూ లేదు. ఇటువంటి సహజ సంఘటనలకు ఎవరినీ బాధ్యులని నిర్ణయించడం సరికాదు. ఒక కారు ప్రమాదం జరిగితే దానికి ఎవరినో బాధ్యులుగా నిర్ణయించి చర్య తీసుకోవడం సమాజ జీవనంలోని ఒక శాసన వ్యవస్థగా కొనసాగడం నాగరిక జీవనంలో ఒక భాగం మాత్రమే. అన్నింటికీ మనం చూపించే కారణాలు పూర్తిగా నిజం కావు. ఇది విశేష సత్యం.
***సద్గురు శివానంద ఈనాడు లో వ్రాసిన అద్భుతమైన వ్యాసం

సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ

సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నవంబరు 10వ.తేదీ, 2013 సాయంత్రము.గం.4.30 నిమిషాలకు సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ షిర్దీ సాయి తత్వ ప్రచార సమితి వారిచే నిర్వహింపబడుతున్నది. స్వామి సాయి శ్రీ విశ్వచైతన్య గారు ఈ కార్యక్రమానికి ఆధ్వర్యము వహించెదరు.భక్తులందరూ కూడా వేదిక వద్దకు ఖచ్చితముగ గం.4.30 నిమిషాలకు రావలెను.పూజా సామాగ్రి భక్తులందరికీ సమితి వారిచే ఉచితముగా యివ్వబడును. 30 సంవత్సరములు శిరిడీలో సాయిబాబాకు అలంకరణ చేసిన స్వర్ణకిరీటమును భక్తులందరూ దర్శించుకొనే భాగ్యము కలదు. ఈ సదవకాశమును అందరూ వినియోగించుకోవలసినదిగా కోరబడుతున్నారు.

సాయి బంధువులందరికి మనవి

సాయి బంధువులందరికి మనవి 




  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని గాంధి బొమ్మ దగ్గర వున్న  సాయి మందిరం లో శనివారం నాడు (9-11-2013) సాయంత్రం 8.00 - 9.30 సమయమున షిర్డీ నుంచి సాయి పాదుకలు మహాల్సాపతి కుటుంబ సభ్యులచే తీసుకోని రాబడుచున్నవి. కోటి సోమవారము నాడు సాయి విశ్వేశ్వరుడును దర్శించు కొని స్వామి కృపను పొందగలరు.  ధన్యవాదములు మీ సాయి బంధువు.

నవ నందులు కొలువు దీరిన మహానంది క్షేత్ర సీమ

నవ నందులు కొలువు దీరిన మహానంది క్షేత్ర సీమ

 


మహానంది ఒక గొప్ప శివ క్షేత్రం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ఈ యాత్రాస్థలం ఒక మండల కేంద్రం కూడా.నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది.

ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. చ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము అణగి వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట జలమే ఒక విశేషం. శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది క్షేత్రానికి మాత్రమె సొంతం. ఇక్కడి కోనేర్లు (పుష్కరిణిలు) విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క అత్యద్భుత పనితనాన్ని తెలియజేస్తాయి.
ప్రధాన ఆలయానికి రాజ గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల నుంచి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి సదా నీరు ఊరుతూనే వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదుఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. ఆ బావులు అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. మరో గొప్ప విశేషం. ఈ మహనంది క్షేత్రంలో ఊరే ఊట నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తోంది.
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు కోనేర్ల రూపంలో ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు ఇక్కడ ఉన్నాయి. కాగా మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పిలుస్తారు. అన్నిటినీ దర్శిస్తే గొప్ప పుణ్య ఫలితం కలుగుతుంది.
నంద్యాల నుండి మహానందికి నేరుగా బస్సు సౌకర్యము కలదు. గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె, ఈ శివ క్షేత్రానికి సమీప రైల్వే స్టేషను.

పరమ పవిత్రం శ్రీవెంకటేశ్వర రూపం

 పరమ పవిత్రం శ్రీవెంకటేశ్వర రూపం

  


          1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.

7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

మీనాక్షి సుందరేశ్వర ఆలయం లేక మీనాక్షి అమ్మవారి ఆలయం

మీనాక్షి సుందరేశ్వర ఆలయం లేక 

మీనాక్షి అమ్మవారి ఆలయం

పేరు: మీనాక్షి సుందరేశ్వర ఆలయం లేక మీనాక్షి అమ్మవారి ఆలయం
కట్టిన తేదీ: నిర్ధారించబడ లేదు
ప్రధానదైవం: దేవి మీనాక్షి (పార్వతి)
శిల్పశైలి: ద్రావిడ నిర్మాణ శైలి
స్థలం: మదురై, తమిళ్ నాడు, ఇండియా
మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు – రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షిరూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక. ఎత్తైన ఆలయ గోపురం 51.9 metres (170 ft) ఎత్తు ఉంది. పురాణ విలువలు
హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని [పార్వతి, హిందువుల దేవత] పార్వతి అవతారాన్ని పెళ్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చాడు. మదుర పాలకుడు [మలయధ్వజ పాండ్య] చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూ మ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఆ పెళ్లి భూమ్మీద అత్యంత పెద్ద కార్యక్రమంగా భావించబడింది, ఎందుకంటే భూమండలం మొత్తంగా మదురై సమీపానికి వచ్చి చేరింది. మీనాక్షి సోదరుడు విష్ణు, పెళ్లి జరిపించడానికి తన పవిత్ర స్థలమైన వైకుంఠం నుంచి తరలి వచ్చాడు. దేవతల నాటకం కారణంగా, ఇతడు ఇంద్ర దేవుడి వంచనకు గురై, రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా, పెళ్లి తిరుప్పరాంకుండ్రంకి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ద్వారా జరిగిపోయింది. ఈ పెళ్లి గురించి ప్రతి ఏటా మదురైలో ‘చిత్తిరై తిరువిళ’ గా జరుపుకుంటారు. మదురైలో నాయకరాజుల పాలనలో, పాలకుడు తిరుమలై నాయకర్ ‘అళకర్ తిరువిళా’ కు ‘మీనాక్షి పెళ్లి’ కి జత కుదిర్చాడు. అందుచేత ‘అళకర్ తిరువిళా’ లేదా ‘చిత్తిరై తిరువిళ’ పుట్టింది.
ఆధునిక చరిత్ర
మూల నిర్మాణ చరిత్ర సరిగా తెలియదు కాని, గత రెండు వేల సంవత్సరాలుగా తమిళ సాహిత్యం ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ ఉంది. తిరుజ్ఞానసంబంధర్, సుప్రసిద్ధ శైవ తత్వశాస్త్రంకి సంబంధించిన హిందూ మహర్షి , ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలోనే పేర్కొన్నాడు, ఇక్కడి దేవుడిని అలవాయి ఇరైవన్ అని వర్ణించాడు. ముస్లిం దురాక్రమణదారు మాలిక్ కపూర్ ద్వారా ఈ ఆలయం 1310లో కూల్చివేయబడినట్లు భావించబడింది మరియు దీనికి సంబంధించిన అన్ని పాత ఆనవాళ్లు ధ్వంసమైపోయాయి. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలనే నిర్ణయం మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు (1559-1600 A.D.) తీసుకున్నాడు, నాయక వంశం ప్రధానమంత్రి మరియు పొలిగర్ సిస్టమ్ నిర్మాత అయిన అరియనాథ ముదలియార్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. తర్వాత తిరుమలై నాయక్ రాజు సిర్కా 1623 నుండి 1659 వరకు దీనికి అమూల్య సహాయం చేశాడు. ఆలయం లోపల వెలుపల అనేక మండపాలు (వీరవసంతరాయర్ మండపం) నిర్మించడంలో ఇతడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు, వసంతోత్సవాన్ని నిర్వహించేందుకోసం వసంత మండపాన్ని, కిలికొట్టు మండపాన్ని నిర్మించాడు మరియు తెప్పకులమ్ వంటి రహదార్లు రాణి మంగమ్మాళ్‌చేత నిర్మించబడాయి. మీనాక్షి నాయకర్ మండపాన్ని రాణి మీనాక్షి నిర్మించింది.
ఆలయ నిర్మాణం
ఆలయం ప్రాచీన మదురై నగరపు భౌగోళిక మరియి సాంప్రదాయిక కేంద్రంగా ఉంటోంది. ఆలయ గోడలు, వీధులు, చివరగా నగర గోడలు (ప్రాచీన) ఆలయం చుట్టూ చతురస్రాకారంలో నిర్మించబడ్డాయి. నగరానికి కేంద్రంగా ఆలయం ఉండేదని వీధులు తామర పువ్వు మరియు దాని రేకులలాగా విస్తరించి ఉండేవని ప్రాచీన తమిళ కావ్యగ్రంధాలు సూచించాయి. ఇది నాలుగు ముఖాలలో నాలుగు ప్రవేశ ద్వారాలతో ఉన్న

 తమిళనాడులోని అతి కొద్ది ఆలయాలలో ఒకటిగా ఉంటోది.
ఆలయ సముదాయం గుండ్రంగా ఉండేది 45 acres (1 m2) మరియు ఆలయం 254 బై 237 మీటర్ల పొడవైన భారీ నిర్మాణంతో ఉండేది. ఆలయం 12 గోపురాలతో కూడి ఉండేది. వీటిలో అతి ఎత్తైనది సుప్రసిద్ధమైన దక్షిణ గోపురం, ఇది చాలా 170 ft (52 m) ఎత్తు కు పెరిగేంది.
దైవపీఠాలు
ఆలయం అనేక మంది దేవతల సముదాయంగా ఉండేది. శివాలయం ఆలయ సముదాయపు నడిబొడ్డులో ఉండేది, దేవతల సాంప్రదాయిక ఆధిక్యత తర్వాత వృద్ధి చేయబడిందని ఇది సూచిస్తుంది. ఆలయం వెలుపల, ఏక శిలపై మలిచిన గణేష్ భారీ విగ్రహం ఉంది, అక్కడ భారీ గణేష్ ఆలయం ఉంది దీన్ని ముఖురుని వినాయకర్ అని పిలుస్తారు. ఆలయ కోనేరును తవ్వే ప్రక్రియలో ఉన్నప్పుడు ఈ దేవత కనుగొనబడిందని భావించబడుతోంది. మీనాక్షి విగ్రహం శివ విగ్రహానికి ఎడమ వైపున ఉంది మరియు శివ విగ్రహంతో పోలిస్తే ఇది పెద్దగా శిల్పలావణ్యంతో ఉండదు.
వెళ్ళి అంబాలమ్
ఇది శివుడి వెళ్ళి (తమిళం) యొక్క అయిదు రాజమందిరాలలో (సభై లేదా సభ) ఒకటి, సిల్వర్ అంబాలమ్ (తమిళం)= వేదిక లేదా దైవపీఠం. ఈ శివ పీఠంకూడా హిందూ దేవుడు నటరాజు అసాధారణ శిల్పంతో కూడి ఉంది. భారీ నటరాజ విగ్రహం భారీ రజత పీఠంపై ఉంది అందుచేత దీన్ని వెళ్ళి అంబాలం (రజిత పీఠం) అని పిలుస్తుంటారు. సుప్రసిద్ధమైన హిందూ గోపురం మరియు శివుడి నృత్య రూపం, సాధారణంగా అతడి ఎడమ పాదం లేపి ఉంటుంది, అతడి కుడిపాదం ఈ ఆలయంలో లేపి ఉంటుంది. పురాణం ప్రకారం శివుడి ప్రియ భక్తుడైన రాజశేఖర పాండ్య అభ్యర్థన మేరకు ఇలా జరిగిందట. అతడు దేవుడిని తన స్థానం మార్చుకోమని కోరాడు, ఎప్పుడూ ఒకే పాదాన్ని లేపి ఉంటే అది ఆ పాదంపై అపారమైన వత్తిడి కలుగజేస్తుందని అతడు భావించాడు. నాట్యం చేస్తున్నప్పుడు తన వ్యక్తిగత అనుభవం ప్రాతిపదికన అతడిలా కోరాడు.
తమిళనాడులో శివుడికున్న ఇతర నాలుగు పీఠాలు:
సభ (కోర్ట్) ప్రాంతం దేవత దీనితో తయారు చేయబడింది
పొన్ అంబలమ్‌పోర్‌సభై చిదంబరం బంగారం
చిత్ర సభై కుర్తాళం లేదా రాగి
రత్న సభై తిరువళ్లంగాడు రత్నాలు
పోర్తమారై సరస్సు
పోర్తమారై కులమ్ , ఆలయంలోని పవిత్రమైన సరస్సు భక్తులకు చాలా పవిత్రమైన స్థలం. ప్రజలు ప్రధాన మండపంలోకి ప్రవేశించే ముందు సరస్సు 165 ft (50 m)చుట్టూ120 ft (37 m) తిరుగుతారు. ఈ పదానికి స్వర్ణ కమలంతో కూడిన సరస్సు అని అర్థం, మరియు దానిలో పెరుగుతున్న కమలం బంగారు రంగుతో ఉంటుంది. పురాణం ప్రకారం, శివుడు చేప లేదా ఏ సముద్ర జీవి ఈ తటాకంలో పెరగలేవని ఒక పక్షికి వాగ్దానం చేశాడట, అందుకే ఈ సరస్సులో ఎలాంటి సముద్ర ప్రాణులు కనిపించవు.తమిళ/0} పురాణాల ప్రకారం, ఈ సరస్సు కొత్త సాహిత్య విలువను నిర్ణయించే న్యాయమూర్తిగా భావించబడేది. అందుచేత, రచయితలు తమ రచనలను ఇక్కడ ఉంచేవారు, పేలవంగా రాయబడిన రచనలు ఇక్కటి నీటిలో మునిగిపోయేవి, ప్రతిభావంతమైన రచనలు నీటిపైన తేలేవి.
వేయిస్తంభాల మంటపం.
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని వేయి స్తంభాల మంటపం తిరునల్వేలి లోని పురాతన నెల్లయప్పార్ ఆలయం నమూనాగా నిర్మించబడింది. ఆయిరం కాల్ మండపం లేదా వేయి స్తంభాల మంటపం 985 (1000కి బదులుగా) చెక్కిన స్తంభాలను కలిగి ఉన్నాయి. దీన్ని సాంస్కృతికంగా అతి ముఖ్యమైన స్థలంగా గుర్తించారు, దీన్ని భారతీయ పురావస్తు సర్వే విభాగం వారు నిర్వహిస్తున్నారు. వేయి స్తంభాల మంటపం 1569లో అరియనాథ ముదలియార్‌చే నిర్మించబడింది. ఇతడు మొట్టమొదటి telugu మదురై నాయక రాజు అయిన విశ్వనాధ నాయకుడి ప్రధానమంత్రి మరియు సేనాధిపతిగా ఉండేవాడు. (1559-1600 A.D.) ఇతడు పాలెగాళ్ల వ్యవస్థ, దేశంలో ఇది భూస్వామ్య సంస్థకు సమానమైనట్టిది, ఇది పలు పాళ్యంలు లేదా చిన్న ప్రాంతాలుగా విభజించబడేది, ప్రతి పాళ్యం కూడా పాళయక్కార్ లేదా ఉప అధికారిచేత పాలించబడేది. మండపం ప్రవేశద్వారం వద్ద, ఇప్పటికీ అతడి విగ్రహాన్ని మనం చూడగలం; అరియనాథ ముదలియార్ భారీ విగ్రహం ఆలయ ప్రవేశద్వారం వద్ద ఒక వైపున సుందరమైన పంచకళ్యాణిపై కూర్చుని ఉండే భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహానికి ఈనాటికీ నేటి భక్తులు పూలదండలు వేసి కొలుస్తుంటారు. ఇందులోని ప్రతి స్తంభమూ చెక్కబడింది మరియు ద్రావిడ సంస్కృతి యొక్క కళాఖండంగా ఉంటుంది. ఈ మంటపంలోనే ఆలయ కళా వస్తుప్రదర్శన శాల ఉంది, ఇక్కడ 1200 సంవత్సరాల పురాతన చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, ఛాయాచిత్రాలు, చిత్తరువులు ఇతర వస్తువులు ప్రదర్శింబడుతున్నాయి. ఈ మంటపం వెలుపల, పశ్చిమం వైపుగా, సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడి ప్రతి స్తంభాన్ని తట్టినప్పుడు ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తుంది. మంటపం దక్షిణం వైపున కల్యాణ మంటపం ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో చిత్తిరై పండుగ కాలంలో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తుంటారు.
అష్ట శక్తి మంటపం
ఇది ఆలయ తూర్పు గోపురం సమీపంలోని మీనాక్షి గర్భగుడి గోపురం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మొట్టమొదటి మంటపం. ఈ మంటపంలో ఎనిమండుగురు దేవతలు ఉంటున్నారు కనుక దీనికి అష్ట శక్తి మంటపం అని పేరు వచ్చింది. ప్రస్తుతం మనం ఈ మంటపంలో అనేక పూజాసామగ్రిని అమ్మే అంగళ్లను చూస్తాము.
పండుగలు
మీనాక్షి తిరుకళ్యాణం (మీనాక్షి పవిత్ర కళ్యాణం) ఈ ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన పండుగ. ప్రతి ఏటా ఏప్రిల్‌లో దీన్ని నిర్వహిస్తారు. ఆ నెల పొడవునా, -తమిళనాడులోని దాదాపు అన్ని ఆలయాలు వార్షిక ఉత్సవాలను జరుపుకుంటుంటాయి- తేర్ తిరువిళాహ్ (రథోత్సవం) మరియు తెప్ప తిరువిళాహ్ (తెప్పోత్సవం)తోపాటు పలు ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతోపాటు, ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించబడతాయి. తమిళనాడులోని అనేక శక్తి ఆలయాల లాగా, తమిళ నెలలు ఆడి (జూలై 15 – ఆగస్ట్ 17) మరియు తాయి (జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15) వరకు శుక్రవారాలలో వేలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రతి తమిళ నెలలోనూ అవని

 ఉర్చవమ్, మార్గళి ఉత్సవం, నవరాత్రి వంటి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి, మీనాక్షి తిరుకల్యాణోత్సవం లాగా అవని మూలోత్సవం కూడా మీనాక్షి అమ్మవారి ఆలయంలో అతి ముఖ్యమైన పండుగదినం. పది రోజులు పాటు జిరిగే ఈ ఉత్సవం ప్రధానంగా సుందరేశ్వరార్ దేవుడికి అంకితం చేయబడుతుంది. దీంట్లో అతడికి చెందిన పలు లీలలను వర్ణిస్తుంటారు a.k.a. ఈ దేవుడి భక్తులను అష్టకష్టాలనుంచి తప్పించడం కోసం మదురై నగరంలో తిరువిలాయడల్‌ని నిర్వహిస్తారు.
ప్రస్తుత పరిస్థితి
ఆలయ గోపురాలను 2009 మార్చివరకు తిరిగి రంగులు అద్దడానికి గాను పరంజాలతో కప్పి ఉంచేవారు. ఈ పని 2009 ఏప్రిల్ నాటికి పూర్తి చేయబడింది, దుర్వ్యసనాలకు దూరంగా ఉండే ఆలయ కళాకారులను ఈ పనికోసం కేటాయించారు. ఆలయం లోపల పెయింటింగులు, గోడలు, శిల్పాలు, విగ్రహాలు వంటి వాటిని పురావస్తు పరంగా పునరుద్ధరించే పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహించారు. ఇప్పుడు ఆలయం చాలా కొత్తగా తయారైంది
.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 

 

కాణిపాకం
పేరు: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము
కట్టిన తేదీ: 11వ శతాబ్దం
ప్రధానదైవం: వినాయకుడు
స్థలం: కాణిపాకం

కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉన్నది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.
పేరువెనుక చరిత్ర
పూర్వం మూగ, గుడ్డి, చెవిటి అన్నదమ్ములకు కలిసి ఒక కాణి మడి ఉన్నది. వారు ఆ మడిని బావినీటి సరఫరాతో వ్యవసాయం చేసేవారు. ఒకసారి తీవ్రమన కరువు కారణంగా బావి ఎండిపోవడంతో వారు బావిని మరికొంత లోతు త్రవ్వుతున్న సనయంలో గునపానికి ఒకారాయి తగిలి అందులో నుండి రక్తం పైకి ఎగజిమ్మ అన్నదమ్ముల మిద పడగానే వారి అవకర్యాలు పోయి వారు ముగ్గురూ స్వస్థులైయ్యారు. వారు ఆనందంగా ఈ విషయం ఊరి వారికి తెలియజేయగా అనదరూ కలిసి అక్కడ వినాయకుని విగ్రహం ఉన్నదని తెఉసుకుని దావినిని బయటకు తీసి అక్కడ ఆలయనిర్మాణం చేసి ఆరాధనలు ప్రారంభించారు. కాణి మడిలో లభించిన వినాయకుడు కనుక ఈ క్షేత్రం కాణిపాకంగా ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయంలో అసత్యం పలికితే వినాయకుడు దండనకు గురిఔతారని విశ్వసించబడుతుంది. అందువలన ఇక్కడ భక్తులు అసత్యం చెప్పరు.
వరసిద్ధి వినాయకుడు
శాసనాధారాల ప్రకారం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కుళోత్తుంగ చోళుడు కట్టించాడు. ఆ తరువాత దాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు విస్తరించారని తెలుస్తున్నది.కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడ వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక వున్నది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్ధం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.
చేరుకొను మార్గములు
బస్సు సౌకర్యములు.
తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు కలదు. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు కలదు. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.
రైలు సౌకర్యములు.
ఆంద్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు కలవు. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.
విమాన సౌకర్యములు.
తిరుపతి(రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు కలవు.
విశేషాలు
కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధంకారు.కాణిపాకంలో ప్రమాణం చేస్తారా?అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయ స్థానాలలో కూడ ప్రామాణికంగా తీసుకునె వారు.
ఇతర ఆలయాలు
ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు వున్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.